6, జనవరి 2018, శనివారం

అజో-విభో-కందాళం వారి 2018 నాటికల రివ్యూలు

అనంతానంతం (రివ్యూ)




అనంతానంతం నాటికలో ఓ సన్నివేశం
అనంతానంతం నాటికని నేను 04-01-2018 సాయంత్రం అజో-విభో-కందాళం వారు నిర్వహించిన కథానాటికల పోటీల్లో చూడటం జరిగింది. ఈ నాటిక బాలగంగాధరతిలక్ రాసిన ఊరిచివరఇల్లు అనే కథని ఎ.బాస్కరచంద్ర నాటకీకరణ చేయగా కొల్లారాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నాటికలో విజయ,సాంబయ్య,రవి, వ్యక్తి అనే పాత్రలుంటాయి. నాటికలో కథ విషయానికొస్తే.. అదో పాత పెంకుటిల్లు... ఆ ఇంట్లో విజయ, సాంబయ్య అనే వృద్ధుడు వుంటూ వుంటారు. రౌడీలు విజయని రేప్ చేద్దామని ప్రయత్నిస్తున్న సమయంలో సాంబయ్య వాళ్ళని ఎదుర్కొని విజయని కాపాడతాడు. ఆ విశ్వాసంతో సాంబయ్యని విజయ తన ఇంట్లో వుండనిస్తుంది. అప్పటి నుంచి సాంబయ్య విజయపంచనే వుంటూ ఆమెకింత వండిపెడుతూ ఇంటిపనులు చేసిపెడుతూ వుంటాడు. సాంబయ్య తనకు తోచినదేదో విజయకి చెబుతూ వుంటాడు. విజయ అతన్ని అప్పుడప్పుడూ కసురుకుంటూ వుంటుంది.. కానీ సాంబయ్య అనుభవం కొన్నిసార్లు ఆమెకి మాటలు మిగలకుండా చేస్తుంది.
ఉరుములు మెరుపులతో వానమొదలైది. విజయ మనసులో ఏవేవో ఆలోచనలు.. సాంబయ్య వచ్చి విజయని పలకరించాడు.. తన ఆలోచనలనుంచి బయటపడింది విజయ. సాంబయ్య ఏదో చెప్పబోయాడు విజయ కసురుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఇంతలో ఒక వ్యక్తి కంగారుగా వచ్చాడు. సాంబయ్య లాంతరుతో వచ్చి వచ్చిన వ్యక్తిని ఎగాదిగా చూశాడు. వ్యక్తితో సాంబయ్య తను చనిపోయి 4 సంవత్సరాలైందనీ... విజయని చూపించి తను కూడా దెయ్యమేనని చెబుతాడు. వచ్చిన వ్యక్తి కంగారుపడతాడు. ఇంతలో విజయ ఆ వ్యక్తితో మాట్లాడి వివరాలు కనుక్కుంటుంది. వచ్చిన వ్యక్తి తిమ్మాపురం వెళ్ళాలని, దారిలో కారు ఆగిపోయిందని, మెకానిక్ ఎవరైనా దొరుకుతారేమో కనుక్కుందామని వచ్చినట్లుగా పరిచయం చేసుకుంటాడు. సాంబయ్యకి కానీ, తనకు కానీ మెకానిజం తెలీదని, మెకానిక్ కావాలంటే తిమ్మాపురం వెళ్ళాలని, లేదంటే వెనక్కివెల్తే పెట్రోల్ బంకుదగ్గర ప్రయత్నించమని చెబుతుంది. సరే అంటూ ఆవ్యక్తి మెకానిక్ కోసం వెల్తూ తన కారుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ వ్యక్తి పాత్రను నాటక రచయిత చాలా గమ్మత్తుగా సృష్టించారు. వచ్చిన వ్యక్తికీ కథకీ సంబంధం లేనట్లుగా నాకు అనిపించింది. అయితే నాటకీకరణ విషయంలో రచయిత ఈ వ్యక్తి పాత్రద్వారా విజయ జీవితంలో జరిగిన సంఘటనలు ప్రేక్షకుడికి చెప్పించే ప్రయత్నం చేశారు. అలాగే వ్యక్తి పాత్ర చిత్రణలో తన భార్య పట్ల తనకున్న అనుమానం, ఆ అనుమానం తీర్చుకోటానికి అతను చూపించే ఉత్సుకత, దానికి అతను సమర్థించుకునే తీరు వెరసి భాస్కర చంద్రగారు ఒక అద్భుతమైన డైలాగ్ రాయటం జరిగింది. ‘‘అనుమానంతో తడిసి ముద్దయిన నా భార్యతో పోలిస్తే.. నేను వర్షంలో తడవటం గొప్పకాదు..’’ అని చెప్పటం అనుమానంతో కూడిన కంగారు, ఆ కంగారులో అతిజాగ్రత్త కనిపిస్తుంది. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత సాంబయ్య తిరిగి విజయ గతాన్ని తవ్వే పనిలో వుంటాడు.


విజయ తన స్కూలు రోజుల్లో ప్రేమించి పెళ్ళిచేసుకున్న రవి కోసం సంవత్సరాలుగా రోజూ ఎదురు చూస్తుంటుంది. సాంబయ్య మాత్రం అతను రాడని, మోసం చేశాడని రకరకాలుగా విజయకి చెప్పటం, ఆమె మనసు విరిచేపనిలో భాగంగా ‘‘చదువుకున్న వాళ్ళు చదువుని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించట్లే, అలాగే నీ అందాన్నీ, నీ వయసునీ పెట్టుబడిగాపెట్టు.. యిందులో తప్పులేదమ్మడూ...’’ అంటూ తన దుష్టబోధ చేయబోతాడు.
కాసేపటికి రవి వస్తాడు. మాటల సందర్భంలో ఇన్నాళ్ళూ తాను ఎదురుచూసిన రవినే తనను చిన్నతనంలో పెళ్ళి చేసుకున్నట్లు విజయకి తెలుస్తుంది.. అంతే ఆ రాత్రి వారు ఆనందంలో మునిగితేలతారు. ఒకటౌతారు.
మరుసటిరోజు రవి ఇంట్లో వున్న సమయంలో వ్యక్తి తన కారు తాను తీసుకెల్టానికి వచ్చి రవిని చూసి ఎవరని అడుగుతాడు. మాటల సందర్భంలో తాను రాత్రి వచ్చి వెళ్ళినట్లు చెబుతూ అనుమానంతో తన భార్యను కోల్పోయానని, గతరాత్రి కురిసిన వర్షం రవిని తన భార్య దగ్గరకు చేర్చి మంచి చేస్తే, తన భార్యను దూరం చేసి తనకు చెడు జరిగిందని చెప్పి వ్యక్తి వెళ్ళిపోతాడు. తర్వాత కాసేపటికి విజయ వస్తుంది. రవితో సైయ్యాటలాడుతుంది. ఆనందంలో మునిగిపోతారు.. కాసేపటికి విజయ రవి ఒడిలో సేద తీరుతుంది. సాంబయ్య వచ్చి విజయ నిద్రపోయిందని రూఢీ చేసుకొని రవితో ‘‘ విజయగురించి లేనిపోనివన్నీ చెప్పి అతని మనసు విరిచేస్తాడు. ఎవరెవరో ఇంటికి వస్తుంటారని, కొన్నాళ్ళు విజయతో గడిపి వెళ్ళిపోతారని, వెళుతూ వెళుతూ ఎంతోకొంత తనకు ముట్టజెబుతారని ఇలా.. చాలాచాలా చెబుతాడు. మనసు విరిగిపోయిన రవి అక్కడి నుండి బయల్దేరగా మెలకువ వచ్చిన విజయ ఎటెల్తున్నావని అడుగుతుంది. రవి విజయని నానా మాటలని ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. రవి ఎందుకు వెళ్ళిపోయాడు. అతనికి నువ్వేం చేప్పావని నిలదీస్తుంది విజయ. సాంబయ్య మాటలు విని అతన్ని అసహ్యించుకుంటుంది. తన మనసులో సాంబయ్యకిచ్చిన గౌరవ స్థానం ఏమిటో చెబుతుంది. తన బ్రతుకుని నాశనం చేసిన సాంబయ్యని ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. మళ్ళీ రవి ఇంట్లోకి వస్తాడు. సాంబయ్యని కొట్టినంత మాత్రాన వాడు చెప్పిందంతా అబద్ధమౌతుందా..అంటూ రవిలోపలికి వస్తాడు.  అటుపై వారిద్దరిమధ్య సంభాషణ తారాస్థాయికి చేరుకుంటుంది. విజయ పవిత్రమైనదని రవి తెలుసుకుంటాడు. ఎవరిమాటలో నమ్మి తనను వదిలేసి వెలదామనుకున్న రవి ప్రేమలో అనుమాన ముందనీ, నిష్కల్మషమైన ప్రేమను అర్థం చేసుకోలేని నీతో నేను వుండలేను.. నీదారి నువ్వు చూసుకో.. నాదారి నాది అని చెప్పటంతో నాటిక ముగుస్తుంది.
నాటిక విషయంలో సంభాషణ అద్భుతంగా సాగింది. యథావిధిగా భాస్కరచంద్రగారు తన మాటలతో మాయచేయటమే కాక, టీం వర్క్ నాటికకు మంచి రన్ ఇచ్చింది. అయితే బాలగంగాధర తిలక్ కథని భాస్కరచంద్రగారు నడిపించిన తీరు బాగనే వున్నప్పటికీ నాటిక రచయిత సృష్టించిన  వ్యక్తి పాత్ర నాటకానికి ఎంతమాత్రం ఉపయోగపడలేదన్నది నా అభిప్రాయం. కేవలం టైం ప్రొలాంగ్ చేసుకోటానికేనని అనిపించింది.  సాంబయ్య, విజయల మధ్య చక్కని కథ నడిచింది. అలాగే సాంబయ్య, విజయ, రవిల మధ్య జరిగే సన్నివేశాలుమాత్రమే నాటికను రక్తి కట్టించాయి. ఏది ఏమైనా టోటల్ గా నాటిక నాతో మాట్లాడిన  ప్రేక్షకులను ఆశించినమేర సంతృప్తి పరచలేకపోయింది.

ఇది అనంతానంతం మీద నా రివ్యూ.. ఈ నాటికకు నేనిస్తున్న స్టార్స్... 2 మీరెన్నిస్తారు.?


భూమిదుఃఖం (నాటిక రివ్యూ)

భూమిదుఃఖం నాటికలో కీలక సన్నివేశం
నేను భూమిదుఃఖం నాటికను 4.1.2018 రాత్రి గుంటూరులో అజో-విభో-కందాళం వారు ఏర్పాటు చేసిన కథానాటికలపోటీలో చూడటం జరిగింది. ఈ నాటికకు మూలకథ రామా చంద్రమౌళి గారు అందించగా నాటకీకరణ బి.వి.ఆర్.శర్మ, దర్శకత్వం ఏవూరి హరిబాబు వహించారు. ఈ నాటికలో సుందరయ్య, రాజకొంరు, శ్రీను, చిచ్చుబుడ్డి, భూదేవి అనే పాత్రలున్నాయి.
నాటిక కథ :
సుందరయ్య, భూదేవిల కుమారుడు రాజకొంరు, శ్రీనులు. రాజకొంరుకి పెళ్ళయి వేరుకాపురం వుంటున్నాడు. తన ఖర్చులకి డబ్బులు అవసరమైనప్పుడల్లా భూదేవి,సుందరయ్యల దగ్గరకి వచ్చి తన అవసరాలు తీర్చుకుంటుంటాడు. అందులో భాగంగానే ఒకరోజు రాజకొంరు జున్నుతీసుకొచ్చి తల్లికి తీపి తినిపిస్తూ డబ్బు అవసరమైందని తన తల్లికి కథలు చెప్పి  ఆమె మెడలోని బంగారపు నానుతాడు తీసుకెల్తాడు. సుందరయ్య తన పెద్దకొడుకు రాజకొంరు మనస్థత్వం తెలిసిన వాడే అవ్వటంతో బాధపడటం మినహా ఏమీ చెయ్యలేకపోతాడు. ఇంతలో రాజకొంరు మరొక వార్త మోసుకొచ్చాడు.. చుట్టుపక్కల పన్నెండూళ్ళని ఖాళీచేయించి అక్కడ ఐటిహబ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని, భూమి సేకరిస్తున్నారని, భూమిని అమ్మేసుకుంటే డబ్బులొస్తాయని చెప్తాడు. భూదేవి, సుందరయ్యలు ఒప్పుకోరు.. తనకు రావాల్సిన వాటా ఎలా తీసుకోవాలో తనకు తెలుసని, రాజకొంరు ఇంట్లోంచి వెళ్ళిబోతుండగా.. సుందరయ్య ఆవేశంతో మాటల్లోకాదు చేతల్లో చూపించమంటాడు..

సుందరయ్య, భూదేవి కుటుంబానికి పేరిరాజుకి మధ్య కుటుంబ గొడవలు జరిగాయి... జరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో పేరిరాజు, రాజకొంరు మీదకి రామలింగాన్ని ఎరగా వేస్తాడు. అందులో భాగంగానే రాజకొంరుకి తాను అడ్డముండి రామలింగం దగ్గరనుండి రెండులక్షలిప్పిస్తాడు. రాజకొంరు పొలంలో తనకు రావాల్సిన భాగాన్ని తనకు పంచివ్వమని పట్టుబడతాడు. పెద్దకొడుకు ఏరోజైనా ఇలాంటిదేదో తెస్తాడని ముందే ఊహించిన భూదేవి తను, తనభర్త బ్రతికున్నంతవరకూ పొలాన్ని అనుభవించే హక్కేతప్ప అమ్ముకొనే హక్కులేకుండా వీలునామా రాయించిస్తుంది. దీంతో రాజకొంరు ఆస్థికాగితాలు నేలకేసి కొట్టి వెళ్ళిపోతాడు.  ఆ తర్వాత శ్రీను ద్వారా రాజకొంరు రెండు రోజులనుంచి ఇంటికి రాలేదని, ఎవరినో అడిగితే ఆటోలో ఎటో వెళ్తుంటే చూశామని చెప్పినట్లు తెలుసుకుంటాడు. కాసేపటికి రాజకొంరు స్వీటు ప్యాకెట్ తో వస్తాడు. తన కొడుకు టెన్త్ క్లాస్ పాసయ్యాడని, స్వీట్స్ కొనమన్నాడని, తీరా కొన్నాక అవి తనకు కాదని తాతా,నాన్నమ్మలకోసమని చెప్పినట్లుగా చెప్పి ఆ స్వీట్లు తినమని తల్లితండ్రులకిచ్చి తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు. మనవడు పాసయ్యాడన్న ఆనందంతో సుందరయ్య స్వీట్లు తింటాడు.. తన భార్య భూదేవికి పెడతాడు.. చిన్న కొడకుక శ్రీనుని కూడా తీసుకొమ్మంటాడు. అందరూ స్వీట్లు తింటారు. తెల్లారేసరికి సుందరయ్య, భూదేవి, శ్రీనులు అచేతనంగా పడివుంటారు. రాజకొంరు పొద్దునే వచ్చి అచేతనంగా పడి వున్న తల్లితండ్రుల్ని, తమ్ముడిని చూసి వాళ్ళపీడ తనకి విరగడైందని భూమిమొత్తం తన సొంతమైందని ఆనందిస్తాడు.. ఆనందంలో తను చేసిన పనిని పైకి అనటం.. అదే సమయంలో చిచ్చుబుడ్డి అనే పాత్ర రావటం వినటం, దానిని తన సెల్ ఫోన్లో షూట్ చేయటం జరుగుతుంది. మెల్లెగా లోపలినుంచి శ్రీను వాంతులు చేసుకుంటూ బయటికొస్తాడు.. చిచ్చుబుడ్డి పరిగెత్తుకెళ్ళి మంచినీళ్ళు తెచ్చిస్తాడు.. శ్రీను వాంతి చేసుకుంటాడు, ఇంతలో మెల్లెగా భూదేవి కదులుతుంది. చిచ్చుబుడ్డి భూదేవికి కూడా మంచినీళ్ళిచ్చి ఆశగా సుందరయ్య దగ్గరికొచ్చి లేపే ప్రయత్నం చేస్తాడు. కానీ సుందరయ్య అప్పటికే చనిపోయివుంటాడు.. భూదేవి, శ్రీను, చిచ్చుబుడ్డి సుందరయ్య శవం వద్ద ఏడుస్తుంటాడు.
రాజకొంరుని ఉద్దేశించి భూలక్ష్మి ఎన్ని అగచాట్లుపడ్డా.. ఎన్నిబాధలు వచ్చినా..  భూమిని నమ్ముకోవాలే కానీ, అమ్ముకోకూడదు.. అని ఎంత చెప్పినా వినకుండా,నువ్వు ఒక్కడివే కోట్లకు పడగలెత్తాలని భావించి ఇంటిల్లిపాదినీ పొట్టన పెట్టకుందామని చూశాడు. ఈ భూమి నీకేం మిగిల్చింది.. దుఃఖం.. భూమి దుఃఖమే.. ఈ భూదేవికి దుఃఖమే మిగిలింది.. అంటూ నాటికను ముగిస్తారు.
ఈ నాటికకు ప్లస్.....
సంభాషణ కొత్తగా అనిపించకపోయినా.. కొద్దిగా బాగుంది. అక్కడక్కడా జనంచే చప్పట్లు కొట్టించే డైలాగులు, సాంబశివరావు అందించిన సంగీతం నాటికకు ప్లస్ అయింది. భూదేవి పాత్రధారిణి సురభి ప్రభావతి, రాజకొంరు పాత్రధారి హరిబాబుల నటన టీంకి ప్లస్ పాయింట్లుగా నిలిచాయి.. దర్శకత్వ విలువలు ఫర్వాలేదనిపించాయి.
ఈ నాటిక మైనస్
సంభాషణలో రిపిటెన్స్.. కథాగమనంలోరిపిటెన్స్.. మిస్సవుతున్నలాజిక్స్.. సింకవ్వని పాత్రల ప్రవేశం.. పాత్ర ప్రవేశించాక సంబంధంలేకుండా ఏదో మాట్లాడించి పంపించేయటం.. లాంటివి ప్రేక్షకులని ఇబ్బందికి గురిచేశాయి.. రచయిత, దర్శకుడు మరొకసారి నాటికపై కూర్చొని సమీక్షించుకుంటే మరిన్ని ప్రదర్శనలు పడే అవకాశం వుంది. నాటిక గంటకంటే కొంచెం ఎక్కువగా వస్తున్నందున సమయపాలన అంశంమీద కూడా దర్శకుడు దృష్టి పెడితే బాగుంటుందని నాకనిపించింది.

టోటల్ గా  ఈ నాటికకు నేనిచ్చే రేటింగ్ 2 స్టార్స్. మరి మీరేటింగ్ ఎంత?


మనసు చెక్కిన శిల్పం (రివ్యూ)


మనసు చెక్కిన శిల్పం నాటికలో పతాక సన్నివేశం
నేను మనసు చెక్కిన శిల్పం నాటికను 5.1.2018 రాత్రి గుంటూరులో అజో-విభో-కందాళం వారు ఏర్పాటు చేసిన కథానాటికలపోటీలో చూడటం జరిగింది. ఈ నాటికకు మూలకథ రావుల పుల్లాచారి రచించిన అమ్మోరు. దీనిని ఆయనే నాటకీకరణ చేసి మనసు చెక్కిన శిల్పంగా మలచారు. దీనికి వెంకట్ గోవాడ దర్శకత్వం వహించారు.  ఈ నాటికలో సర్పంచ్, కేశవయ్య, పూజారి, కాశయ్య, దేవేంద్ర, విజయ్, కొందరు వ్యక్తులుంటారు.
నాటిక కథ : ఈ నాటిక పెద్ద వానతో ప్రారంభమవుతుంది. ఆవానకి ఊరంతా కూడా అతలాకుతలం అవుతుంది. ఆ వర్షానికి పడ్డ పిడుగు డైరెక్టుగా అమ్మవారిమీద పడి విగ్రహం తునాతునకలౌతుంది. భక్తులంతా కూడా కలవరపడతారు. ఎలాగైనా అమ్మవారి విగ్రహం తిరిగి పునఃప్రతిష్ఠించాలని ఊరంతా అనుకుంటారు. ఊరన్నాక రకరకాల మనస్థత్వాల వారుంటారు. వారిలో కొంతమంది యదవలూ వుంటారు. అలాంటివాడే కేశవయ్య. ఊరంతా ఒకదారంటే ఉలిపికట్టెది ఒకదారన్న చందంగా ప్రవర్తిస్తుంటాడు. ముందు నుంచి అమ్మవారి విగ్రహం ఎందుకంటాడు, ఊరికి గుడెందుకు,బడెందుకంటాడు.. కేశవయ్య కూడా పెద్దమనిషిగా చెలామణి అవుతుంటాడు. మరుసటిరోజు ఉదయానే రచ్చబండ దగ్గర పంచాయితీ ఏర్పాటు చేసి దేవత విగ్రహం ప్రతిష్ఠించాలని, గుడి ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తుంది పంచాయితీ.. అదే ఊరికి మాస్టారిగా వచ్చిన విజయ్ బడి నిర్మాణం చేయాలని పట్టుబడతాడు. ముందు గుడికట్టి తర్వాత బడి సంగతి చూద్దామని పంచాయితీ తీర్మానిస్తుంది. గుడి అన్నాక విగ్రహముండాలి.. విగ్రహం చెక్కేదెవరు అనే సమస్య వస్తుంది.. అందుకు ఆ వూరిలో వున్న కాశయ్య అనే శిల్పిని సూచిస్తాడు సర్పంచ్.. కాశయ్య తనభార్యపోయిన దుఃఖంలో వున్నానని.. అప్పటి నుంచి శిల్పాలు చెక్కటం మానేశానని చెబుతున్నా వినకుండా బలవంతంగా ఒప్పిస్తారు. చేసేది లేక కాశయ్య ఒప్పుకుంటాడు. పెద్ద రాయిని తెచ్చి శిల్పం ఎలా చెక్కాలో ఆలోచిస్తుంటాడు. మనసు నిలవక శిల్పం మొదలు పెట్టలేకపోతుండగా దేవేంద్ర తానే శిల్పం చెక్కుతానని తండ్రి నుంచి సుత్తి, ఉలి తీసుకొని చెక్కబోయి చేయి నలగ్గొట్టుకుంటుంది. కాశయ్య తన కూతురుని కోప్పడి శిల్పం ఎలా చెక్కుతానో చూడు.. అంటూ శిల్పం చెక్కటం మొదలు పెడతాడు.. కొన్నాళ్ళకు శిల్పం తయారౌతుంది. ఊరిపెద్దలు వచ్చి విగ్రహాన్ని చూస్తారు.. ఒకవైపున కలకత్తా కాళికలా, మరోవైపు కనకదుర్గమ్మలా, మరోవైపు బాసర సరస్వతీ మాతలా కనిపిస్తుందని చెప్పుకుంటారు. కానీ కేశవయ్యకు మాత్రం ఆ ఊరిలో తిరిగిన ఎవరో మనిషి రూపం కనిపిస్తోందంటూ పేచీ పెడతాడు. జనం కేశవయ్య నోరు మూయిస్తారు. పూజారి విగ్రహాన్ని చూసి మైమరచిపోతాడు. కొన్నాళ్ళకి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుంది. అనంతరం కాశయ్యకి సన్మానం చేసేందుకు సర్పంచ్ తో పాటు పలువురు ఊరి పెద్దలందరూ గుడిలో అతనికి సన్మానం చేయబోతుండగా కేశవయ్యకి ఆ విగ్రహంలో కాశయ్య భార్య గోవిందమ్మ పోలికలు కనిపిస్తున్నాయని పేచీపెడతాడు. దాంతో పూజారికీ, ఊరివారికీ అందరికీ అందులో గోవిందమ్మ పోలికలే కనిపిస్తాయి. కాశయ్య కళాద్రోహి అని అతన్ని శిక్షించాలని పట్టుపడతారు. కాశయ్య ఎంత చెప్పినా వినకుండా అది గోవిందమ్మ విగ్రహమే అని అందరూ ఒకేమాటమీద వుంటారు. విజయ్ ఎంత చెప్పినా కూడా ఊరి ప్రజలు అతని మాట వినకుండా విగ్రహాన్ని ధ్వంశం చేయటానికి ప్రయత్నిస్తుండగా  ఆ విగ్రహాన్ని ధ్వంశం చేసే అర్హత ఎవ్వరికీ లేదని సృష్ఠించిన వాడిని నేను, స్థితిని నేను, లయ కారకుడనూ నేనే అవుతానని, నా మనసు చెక్కిన శిల్పాన్ని నేనే నాశనం చేస్తానని కాశయ్య విగ్రహాన్ని ధ్వంశం చేయబోవటంతో నాటిక ముగుస్తుంది. ఒక అమరశిల్పికి జరిగిన అవమానమే కథాంశంగా తీసుకొని రంగస్థలంపై ప్రతిష్ఠించిన నాటికే ఈ మనసు చెక్కిన శిల్పం.
నాటికకు ప్లస్ : సెట్.. ప్రతి సన్నివేశాన్నీ ఆసక్తికరంగా సెట్ వేసి వాస్తవికతను ప్రతిబింబింపచేయటం. లైటింగ్ మరో కీలకమైన భూమికను పోషించింది. వెంకట్ గోవాడ దర్శకత్వం ఎప్పటిలాగే తన ముద్రను సుస్థిరం చేసుకుంది..
మైనస్ : టీం వర్క్.. ఆర్టిస్టుల మధ్య సమన్వయం లేకపోవటం... రిహార్సిల్స్ పడకపోవటం... పెర్ఫార్మెన్స్... సంభాషణలో ఉపోద్ఘాతాలు. కథలోని నాటకీయత నాటకీకరణలో లోపించటం. సందర్భానికి తగిన సంగీతం అందించటంలో పూర్తిగా విఫలం..
టోటల్ గా నేను ఈ నాటికకు ఇచ్చే రేటింగ్ 1 స్టార్. మీరిచ్చే రేటింగ్ ఎంత.?


గుర్తు తెలియని శవం( రివ్యూ)

నేనీ నాటికను 5-1-2018న గుంటూరులో అజో-విభో-కందాళంలో చూడటం జరిగింది. ఈ నాటికకు మూలకథని ఎ.యన్.జగన్నాథశర్మ అందించగా యల్లాప్రగడ భాస్కరరావు దీనిని నాటకీకరించగా వై.ఎస్.కృష్ణేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ నాటికలో రామశాస్త్రి, ఇందుమతి, తులశమ్మ, రమేష్, ఆటోచిన్నా, ఇంటిఓనరు వేషాలున్నాయి. 
గుర్తుతెలియని శవం పతాక సన్నివేశం

నాటిక కథ విషయానికొస్తే.. : 

రామశాస్త్రి బ్రతకనేర్చిన బ్రాహ్మణుడే అయినా కాలం కలిసిరాక అతని తెలివితేటలు అంతంత మాత్రంగా పనిచేస్తుంటాయి. ఎలాంటి అపాయాన్నైనా ఉపాయంతో నెట్టేయగల సమర్థుడు. ఎంతకైనా దిగజారగలడు.. ఎగబాకగలడు. ఇందుమతి రామశాస్త్రిభార్య.. అనుకూలవతి అయిన ఇల్లాలు. అత్తను అపురూపంగా చూసుకుంటుంది. తులశమ్మ రామశాస్త్రి తల్లి.. మతిస్థిమితం సరిగాలేదు. రామశాస్త్రి పితృకర్మలు చేయించే వృత్తిలో వుంటూ వుంటాడు. అతని తల్లి తులశమ్మ అనారోగ్యంతో బాధపడుతూ వుంటుంది. ఆమె మందులకీ, పిల్లవాడి స్కూలు ఫీజులకీ, ఇంటిఖర్చులకీ ఇలా తెచ్చిన డబ్బులంతా అయిపోతుంటాయి. ఇన్ స్టాల్ మెంట్లో టీ.వీ కొంటాడు. అయితే టీ.వీ.ఇన్ స్టాల్ మెంట్లు సరిగా కట్టలేని పరిస్థితి అతనిది.. రామశాస్త్రి కర్మకాండ కార్యక్రమం పూర్తిచేసి సంభావనలు తీసుకొని ఇంటికి వస్తాడు. ఇందుమతికి తను తెచ్చిన డబ్బులు, ఆయా సరుకులు ఇచ్చి లెక్కలు చెబుతుంటాడు. ఇంతలో టీ.వీ. ఇన్ స్టాల్ మెంట్ తాలూకు డబ్బులు కట్టమంటూ రమేష్ వస్తాడు. నాలుగు నెలల బాకీ మొత్తం ఇవ్వమని పీకలమీద కూర్చుంటాడు. పిల్లవాడి స్కూలుఫీజు కోసం, తల్లి మందుల కోసం, ఇంటి అవసరాలకోసం అంటూ రకరకాలుగా దాచిన డబ్బు మొత్తం టీవీ ఇన్ స్టాల్మెంట్ పుణ్యమా అని మొత్తం తీసుకుపోతాడు రమేష్. తన తల్లికి మందులు కూడా కొనివ్వలేని తన నిస్సహాయతను తనే నిందించుకుంటాడు. ఇంతలో రామేశ్వరశాస్త్రి అక్క తన పిల్లల్ని తీసుకొని పదిరోజులుంటానికి వస్తున్నానంటూ ఫోన్ చేస్తుంది. అయితే తను కుటుంబంతో సహా ఏదో కార్యక్రమం పడి ఊరెళుతున్నామని, ఈసారి ఊరిలో వున్నప్పుడు ఫోన్ చేస్తానని, అప్పుడు వద్దురుగానంటూ చెప్పి తప్పించుకుంటాడు. తన పేదరికాన్ని, నిస్సహాయతను నిందించుకుంటుండగా.. ఆటోచిన్నా వస్తాడు. రామేశ్వరశాస్త్రి గుర్తుపట్టడు. కూడేరులో వారింటి వెనుక బజారులో వుండేవాళ్ళమంటూ తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఆవూరు వదిలిపెట్టి సిటీకి వచ్చానని ఆటో నడుపుకుంటున్నానని, నువ్విక్కండ వుంటున్నావని తెలుసుకొని అమ్మనీ, నిన్నూ చూసి పోదామని వచ్చినట్లు చెబుతాడు. తన జేబులోంచి విజిటింగ్ కార్డు ఇచ్చి ఎప్పుడు అవసరమైనా పిలవమంటాడు. మాటల సందర్భంలో రామేశ్వరశాస్త్రి తల్లిని చూడాలని ఆటో చిన్నా కోరతాడు. తల్లిని పిలిచే క్రమంలో మతిస్థిమితంలేని తన తల్లి ఇంట్లోంచి ఎటో వెళ్ళిందని తెలుసుకొని రామేశ్వరశాస్త్రి భార్యపై కోప్పడతాడు. ఇంతలో చిన్నా వాళ్ళ గొడవకి తెరదించుతూ తన ఆటోలో వెళ్ళి వెతకుదామంటాడు. అనుకోకుండా టీ.వీ. ఇన్ స్టాల్మెంట్ రమేష్ భ్రదంగా రామేశ్వరశాస్త్రి తల్లిని తీసుకొచ్చి ఇంట్లో దింపుతాడు. ఇందాక తానది వృత్తిధర్మమని, ఇప్పుడు మానవధర్మమని చెప్పి రమేష్ తన జేబులోంచి వెయ్యిరూపాయలు ఇవ్వబోగా రామేశ్వరశాస్త్రి నిరాకరిస్తాడు.  పెద్దావిడని జాగ్రత్తగా చూసుకోమని వెళ్ళిపోతాడు. రామేశ్వరశాస్త్రి చిన్నాను తన తల్లికి పరిచయం చేస్తాడు. తల్లి పరిస్థితి, తన పరిస్థితి చిన్నాకి వివరిస్తాడు. 
ఒకరోజు రాత్రి ఉరుములు, మెరుపులు. రామశాస్త్రి జాతకచక్రం వేస్తుంటాడు. ఇందుమతి వచ్చి టైం చాలా అయిందని, వచ్చి పడుకోమని భర్తకి చెబుతుంది. తను పనిలో వున్నాడని చెప్పి పంపించేస్తాడు. ఇంతలో రామేశ్వరశాస్త్రి తల్లి భయంతో వచ్చి రామేశ్వరశాస్త్రి దగ్గరకి వస్తుంది. భయపడద్దని చెప్పి భార్యని పిలిచి తన తల్లిని తనతో పడుకోపెట్టుకోమంటాడు. కాసేపటికి మళ్ళీ తులశమ్మ కొడుకు దగ్గరకే వస్తుంది. ఏంటని అడిగితే భయమేస్తుందని, ఇక్కడే పడుకుంటానని చెబుతుంది. రామేశ్వరశాస్త్రితో అక్కలకి కబురు చెయ్యమని చెబుతుంది. రామేశ్వరశాస్త్రి తులశమ్మని పడుకోబెడతాడు. రాముడూ.. రాముడూ అంటూ తల్లి తులశమ్మ చనిపోతుంది. కాసేపటికి రామేశ్వరశాస్త్రి భార్య ఇందుని పిలుస్తాడు. తల్లి మరణవార్త చెబుతాడు. వెంటనే ఇందు రామేశ్వరశాస్త్రి అక్కకి ఫోన్ చేస్తే దాన్ని కట్ చేస్తాడు. ఇంటి ఓనరు వెంటనే ఇల్లు ఖాళీ చేసిపొమ్మన్నట్లు కలకంటాడు.. అంతలోనే స్పృహలోకి వస్తాడు. తన తల్లి ఛనిపోలేదని నాటకమాడదామని భార్యని బలవంతంగా ఒప్పిస్తాడు. పైకి ఏడవద్దని, లోలోపల ఏడ్వమని ఆమె నోరు మూస్తాడు. ఇంతలో ఇంటి ఓనరు తలుపు కొడతాడు. అంతరాత్రి పూట ఇంకా లైట్లు వెలుగుతుండటంతో చూసి పోదామని వచ్చినట్లు చెబుతాడు. పెద్దావిడని చూసి పోదామని వచ్చానని చెబుతాడు. తన తల్లి నిద్రపోతోందని నమ్మించటానికి రామేశ్వరశాస్త్రిగా వై.ఎస్.కృష్ణేశ్వరరావు నటించిన తీరు ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇంటి ఓనరు సమాధానపడి వెళ్ళిపోతాడు. రామేశ్వరశాస్త్రి ఆటోచిన్నాకి ఫోన్ చేసి పిలిపిస్తాడు. వీధిలో నిలబడతానని చెప్పి బయటికి వెళుతూ తన భార్యతో పొరపాటున తన అక్క ఫోన్ చేస్తే పొరపాటున ప్రెస్ అయ్యి ఫోన్ వచ్చిందని సర్ధిచెప్పమని, అమ్మ నిద్రపోతోందని చెప్పమని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. కాసేపటికి చిన్నాని తీసుకొని రామేశ్వరశాస్త్రి వస్తాడు. కాసేపు చిన్నాకి రామేశ్వరశాస్త్రికి మధ్య వాగ్వాదం జరుగుతుంది. చివరికి రామేశ్వరశాస్త్రి తన తల్లి శవాన్ని దూరంగా ఎక్కడైనా పారెయ్యమని, తెలియని వాళ్ళకు అది గుర్తు తెలియని శవమని, తెలిసిన వాళ్ళకు మతిస్థిమితం లేని వృద్ధురాలి శవమని చెప్పి చిన్నాని బలవంతంగా ఒప్పిస్తాడు. 
నిజానికి కథ ఇక్కడితోనే అయిపోయింది. కానీ... పతాక సన్నివేశంలో రామేశ్వరశాస్త్రి ఒక్కడే కూర్చొని వుంటాడు. ఎక్కడెక్కడో ఆత్మాహుతి దాడి అని వార్తలు అతని చెవుల్లో హోరెత్తిస్తుంటాయి. రామేశ్వరశాస్త్రి పశ్చాత్తాపపడుతూ చెప్పే ఆఖరి డైలాగ్ అందరినీ కట్టిపడేస్తుంది. 
‘‘ఆత్మాహుతి దాడి.. ఆత్మాహుతి దాడి.. ఎక్కడో కాదు.. ఆత్మాహుతి దాడి జరిగింది.. ఇక్కడే, మీ పక్కనే, మీ మధ్యనే.. ఒక మనిషి ఆత్మను ఆహుతి చేసుకున్నాడు. ఆత్మాహుతి అంటే ఆత్మను ఆహుతి చేసుకోటమే.. అంటే ఆత్మను చంపుకోవటమే.. నేను నా ఆత్మను ఆహుతి చేసుకున్నాను. నిజం ఎవ్వరికీ తెలీదు.. ఒక్క దరిద్రానికి తప్ప.. నా నిస్సహాయత, నా చేతకానితనం, నా దరిద్రం నా ఆత్మను ఆహుతిచేశాయి. ఆత్మను చంపుకోవటం అంటే .. ఆత్మలేని శరీరం శవంతో సమానం.. నేను నా ఆత్మను చంపుకొని నా తల్లిని ‘‘గుర్తుతెలియని శవం’’గా చేశాననుకుంటున్నారు.. కానీ.. ఆమెనలా చేసిన నేను ‘‘గుర్తుతెలియని శవం’’.. అమ్మా భారతీ....! నాలాంటి గుర్తు తెలియని శవాలకు జన్మనివ్వకు.. ఈ గుర్తుతెలియని శవాన్ని క్షమించమ్మా ’’ అంటూ చెప్పిన సంభాషణతో అసలైన గుర్తు తెలియని శవంగా రామేశ్వరశాస్త్రి దర్శనమిస్తాడు. ఆఖరికి ఒక కాకి వచ్చి రామేశ్వరశాస్త్రి మెడలోని యజ్ఞోపవీతాన్ని తెంచుకొని వెళ్ళిపోవటంతో నాటిక ముగుస్తుంది.
ఈ నాటికకు ప్లస్ లు... 
సంభాషణ, కథనం, దర్శకత్వం, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్

మైనస్ లు సంగీతం కూడా సహకరిస్తే నాటిక మరింత అందంగా ఆకట్టుకుంటుంది. నాటికను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట నాకు లోపాలు కనిపించలేదు.. 
దీనికి నేనిచ్చే స్టారింగ్ *****


బంధాలబరువెంత (రివ్యూ)

బంధాలబరువెంత నాటికలో ఓ సన్నివేశం
నేనీ నాటికను 5-1-2018న గుంటూరులో అజో-విభో-కందాళంలో చూడటం జరిగింది. ఈ నాటికకు మూలకథని జాస్తి రమాదేవి అందించగా నాటకీకరణ, దర్శకత్వం చెలికాని వెంకటరావు వహించటం జరిగింది. ఇందులో శివరావు, జనార్థన్, పార్వతీశం, పార్థసారధి, రైతు, పావని, సీత అనే పాత్రలుంటాయి. శివరావు తన కుటుంబ ఆర్థిక పరిస్థితి వివరిస్తూ తమ్ముడు జనార్థన్ కి ఉత్తరం రాస్తాడు. తండ్రి ఆరోగ్యం సరిగాలేదని, సిటీకి తీసుకొచ్చి మంచి డాక్టర్ కి చూపించి వైద్యం చేయించమని లెటర్ లో కోరతాడు. లెటర్ చదువుతున్న జనార్థన్ దగ్గరనుంచి అతని భార్య పావని లెటర్ తీసుకొని చించిపారేస్తుంది. భార్యాభర్తల వాగ్వాదం చోటుచేసుకుంటుంది. ఎంత వాగ్వాదమైనా భార్య (పావని) భర్తని తన నోటిదూకుడుతో ఓడిస్తుంది. భర్త (జనార్థన్) భార్య నోటికి అడ్డుకట్టవేయలేకపోతాడు. కాసేపు నాటిక గడిచింతర్వాత శివరావు వస్తాడు. శివరావుని చూస్తూనే జనార్థన్ ఆప్యాయంగా పలకరిస్తాడు. శివరావు పక్కింటి జగన్నాథం అబ్బాయికి సంబంధం చూడడానికి రమ్మంటే వచ్చానని, ఒకసారి తమ్ముడిని కూడా చూసివెల్దామని వచ్చినట్లు చెబుతాడు. ఇంతలో పావని లేని ఆప్యాయతను ఒలకబోస్తూ శివరావుని పలకరిస్తుంది. మాటల సందర్భంలో శివరావు ఉత్తరం గురించి అడుగుతాడు. జనార్థన్ తడబడబోతుండగా... పావని తనకే ఉత్తరం అందలేదని, జనార్థన్ కి వ్యాపారంలో నష్టమొచ్చిందని చెబుతూ కల్లబొల్లి ఏడుపు ఏడుస్తుంది. జనార్థన్ తన భార్య చేష్టలకి కోపం తెచ్చుకొని కసురుకోబోతే.. శివరావు తన తమ్ముడిని ఎలాగైనా ఆదుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించి వెళ్ళిపోతాడు. వ్యాపారంలో లాభం వస్తే నష్టమొచ్చిందని ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీస్తాడు.. ఎప్పటిలాగే పాడిందే పాటగా ఆస్తిమొత్తం మీ అన్న అనుభవిస్తూ ఖర్చులు మన నెత్తిన రుద్దాలని చూస్తున్నాడన్న సెన్స్ లో భావప్రకటన చేస్తుంది. మళ్ళీ మాటామాటా పెరుగుతుంది. చివరికి భార్యాభర్తా ఇద్దరూ ఒక నిర్ణయానికి వస్తారు. ఎవరి పుట్టింటివాళ్ళూ తమ ఇంటి గడప తొక్కకూడదని ఒకరినొకరు హెచ్చరించుకుంటారు. భార్య ప్రవర్తనకు జనార్థన్ అసహ్యించుకొని బయటికి వెళ్ళిపోతాడు. అంతలోనే పావని తండ్రి పార్వతీశం వస్తాడు. వచ్చిందే తడవుగా తన కోడలు సీత చేసిన వంటల గురించి, సీత గురించి చెప్పిందే చెబుతూ ఏకరువు పెడతాడు.  కాసేపటికి మాటల సందర్భంలో తనకు, తన భర్తకు జరిగిన గొడవ గురించి చెప్పుకుంటుంది పావని. పార్వతీశం జరిగిందానికి బాధపడి తన కూతురికి బుద్ధివచ్చేలా రెండుమూడు చురకలు అంటించి అక్కడి నుండి కదులుతుండగా.. జనార్థన్ ఇంట్లోకి వస్తాడు.. మావని చూస్తూనే ఎప్పుడొచ్చారంటూ పలకరిస్తాడు. పార్వతీశం మళ్ళీ ఒక సెటైరేస్తాడు.. మావా అల్లుళ్ళమధ్య రెండు డైలాగులు నడుస్తాయి... మూడో డైలాగు పావని మీదకు విసురుతాడు జనార్థన్. అంతే పావని అంతెత్తున ఎగిరి పడుతుంది. మళ్ళీ వారి గొడవ రాజుకుంటుంది. పార్వతీశం వాళ్ళ గొడవని అక్కడితో కట్ చేస్తూ... ‘‘ మీవాదన ఆపండి.. తన్నుకున్నా.. ఇష్టంలేకపోయినా మాటల్లేకపోయినా మీ పిల్లలకోసం కలిసే వుంటారు. మా పిల్లల్ని కలుసుకోకుండా చూడకుండా మమ్మల్నెలా దూరంగా వుండమంటారు. మీరేకాదు..మాకూ పిలలున్నారు. మా పిల్లల్ని దూరం చేసే హక్కు మీకెక్కడిది. మీరూ మీరూ గొడవపడితే మధ్యలో మేమేం చేస్తాం.. మా ప్రమేయం ఎందుకు.. మీరు గమనించారో లేదో.. భార్యాభర్తలు గొడవపడ్డా వాళ్ళ తల్లిదండ్రులు స్నేహంగానే వుంటారు.. మా అవసరాలు తీర్చకపోయినా, కోరికలను పట్టించుకోకపోయినా ఫర్వాలేదు.. మిమ్మల్ని చూడకూడదు.. మాట్లాడకూడదు అనే షరతులు మాత్రం పెట్టకండి..’’ అని మరో నాలుగు ముక్కలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.  అక్కడికి మొదటి సీన్ అయిపోతుంది. రెండో సీన్ పార్వతీశం ఇల్లు.. సీతకి పిల్లలు పుట్టరు.. ఈ కారణంగా పార్థసారధి సీతను గొడ్రాలంటూ దెప్పుతాడు. దానికి హర్టయిన పార్వతీశం కొడుకుతో కోడలికి క్షమాపణ చెప్పిస్తాడు. పార్థసారధి సారీ చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. కోడలితో పిల్లలు పుట్టనందుకు బాధపడద్దని.. తను చచ్చి ఆమె కడుపున బిడ్డగా పుడతానని చెప్పి ఓదారుస్తాడు. కొంతసేపటికి పార్థసారధి వస్తాడు.  మాటా మంతీ జరిగిన తర్వాత మాటల సందర్భంలో శివరావు తన తమ్ముడికి వ్యాపారంలో నష్టమొచ్చిన సంగతి పార్వతీశానికి చెబుతాడు. తన కూతురు చేసిన నిర్వాకానికి పార్వతీశం ఆశ్చర్యపోతాడు. తన పొలం అమ్మేసి బాకీ తీర్చుకోమని తన తమ్ముడికి చెప్పిన వినడని, ఏం చెయ్యాలో తెలీని స్థితిలో సలహాకోసం పార్వతీశం దగ్గరికి వచ్చినట్లుగా శివరావు చెప్తాడు. పొలం అమ్మద్దని పార్వతీశం నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు.. కానీ శివరావు అవేమీ పట్టించుకోకుండా తమ్ముడు ఇబ్బందుల్లో వుంటే చూడలేనని, కష్టం ఎరుగడనీ, పొలాన్ని అమ్మేసి వాడి బాకీ తీర్చుకోమని, తను వచ్చినట్లు తమ్ముడికి తెలీనీయద్దని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాసేపటికి సీత, వస్తుంది.. తన మావగారితో పావనికి వ్యాపారంలో నష్టమొచ్చిందా..? అని ఆశ్చర్యపోతుంది.. తన కూతురు మనసెరిగిన పార్వతీశం అసలు విషయం చెప్పి బాధపడతాడు. మూడవ సీన్ స్టార్ట్ అయ్యే సరికి తన తండ్రికి బాగాలేదని, చనిపోయి వుంటాడని పిచ్చిపిచ్చి ఆలోచనలు చేస్తుంటాడు. ఎలాగైనా తన తండ్రిని చూడాలని ఆరాటపడతాడు. పావని తన భర్త వెళ్ళటానికి వీల్లేదని అడ్డుపడుతుంది. ఇంతలో శివరావు డబ్బులు తీసుకొని తన తమ్ముడికి ఇద్దామని వస్తాడు. తన తండ్రి చనిపోతే కబురు చెప్పటానికి వచ్చాడని అపోహపడి జనార్థన్ పెద్దగా గుండెలు పగిలేలా ఏడుస్తాడు. తండ్రికి ఏం జరగలేదని, నువ్వు పంపిన డాక్టర్ తండ్రి అనారోగ్యాన్ని నయం చేశాడని శివరావు చెప్తాడు. తనకు వ్యాపారంలో నష్టంరాలేదని, తన భార్య కావాలని అబద్ధం చెప్పినట్లుగా జనార్థన్ తన అన్నకి వివరిస్తాడు. నష్టంరానందుకు శివరావు ఆనందిస్తాడు. తన భర్త తనకు తెలీకుండా మావగారికి వైద్యం చేయించాడని తెలిసి పావని భర్తమీద అంతెత్తున లేస్తుంది. తను ఏ డాక్టర్ ని పంపలేదని జనార్థన్ ఎంత చెప్పినా వినిపించుకోదు. చివరికి చిలికిచిలికి వారి గొడవ విడాకులదాకా వెళుతుంది. ఇంతలో పార్వతీశం వస్తాడు. తన ఇంట్లో శివరాంతో జరిగిన సంభాషణ చెబుతూ... పావని మావగారికి వైద్యం చేయించింది తనే అన్న విషయాన్ని బయట పెడతాడు... ఎవరు చేసిన తప్పులు వాళ్ళకి అర్థమయ్యేలా చెబుతాడు. చివరికి పావని తను చేసిన తప్పు తెలుసుకొని తన మావగార్ని చూసేందుకు ఊరికి బయల్దేరుతుంది. ఇంతలో పార్వతీశం ఫోను రింగవుతుంది. ఫోన్లో తన కోడలు సీత నెలతప్పిందనే వార్త విని అందరూ ఆనందిస్తారు.. నాటిక పరిసమాప్తమౌతుంది.
టోటల్ గా ఈ నాటిక మైనస్ లు.. :
నాటిక రచనపరంగా బాగున్నప్పటికీ దర్శకత్వ విలువలు ఆశించిన స్థాయిలో లేవు. నటులు తమతమ పాత్రల్లో ఒదిగి చేయలేకపోయారు. సంగీతం నాటికకు ప్లస్ కాలేకపోయింది. రంగాలంకరణ, లైటింగ్ కొత్తగా ఏమీ అనిపించ లేదు. నాటికలో సమిష్టి కృషి లోపించటం వల్ల ప్రొడక్షన్ స్థాయిని అందుకోలేకపోయింది.
ప్లస్ పాయింట్ లు..
నాటిక రచన పరంగా ఫర్వాలేదని పించింది. ఇంతకన్నా ఇందులో ప్లస్ లు వెతికినా కనిపించలేదు.
ఈ నాటికకు నేనిచ్చే స్టార్ ఒక్కటి మాత్రమే..... (*)

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు