రంగస్థల నగ్నచిత్రం 2.1

రంగస్థల నగ్నచిత్రం 2.1


కొత్తనీరు నాటిక విజయవంతంగా ప్రదర్శించిన తరువాత రచయితగా నాకు కొంత మంచిపేరు వచ్చిన విషయం నాటక రంగ మిత్రులకి తెలిసిందే. అందులో భాగంగానే శ్రీకాకుళం రంగస్థల కళాకారుల ఐక్యవేదిక వారు నిర్వహించిన నాటికల పోటీల విషయం నాకు తెలిసింది. దానికి సంబంధించిన ఎంట్రీ ఫారం చిట్టి వెంకటరావు గారు, రామలింగస్వామి గారు నాకు పంపించారు. కొత్త నాటికలకు పెద్ద పీట వేస్తున్నట్లుగా అప్లికేషన్ ఫారంలో పేర్కొన్నారు. నాకు ఎంతో నచ్చింది. కొత్తదనం వెలుగు లోకి రావాలని, కొత్త తరం నాటకరంగంలోకి రావాలని కోరుకునే వారిలో నేనూ వున్నాను.నేనూ అలా వచ్చిన వాడినే కదా.. అందుకే నేనొక నాటికను రాద్దామని అనుకున్నాను.

అదే సమయంలో కొత్తనీరు నాటిక భీమవరంలో ప్రదర్శించే సమయంలో జస్ట్ స్మైల్, తిరుపతి నాటక సమాజానికి చెందిన డాక్టర్ జె.రవీంద్రతో నాకు పరిచయం ఏర్పడింది. ఆపరిచయం కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఆ రోజు కొత్తనీరు నాటికలో నేనూ ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాను. ఆ పాత్రలో నేను నటించిన తీరు రవీంద్రని ఆకట్టుకుంది. పైగా స్క్రిప్ట్ కూడా అతనికి బాగా నచ్చిందని చాలాసార్లు చెప్పారు. ఆయన నాతో ఒక నాటిక రాసివ్వమని ఎన్నోసార్లు అడిగారు. అప్పటికి నా దగ్గర స్క్రిప్ట్ ఏదీ లేని కారణంగా ఏదో ఒకటి రాయచ్చులే అని ఆలోచిస్తూ కాలయాపన చేశాను. అలాంటి సమయంలోనే కేరళ రాష్ట్రంలోని పాల్ఘాట్ జిల్లాలో జరిగిన ఒక సంఘటన నా దృష్టికి వచ్చింది.

అమ్మకానికో అమ్మ వెనుక....

నేను నా ఫ్యామిలీతో తిరుపతి నుంచి గుంటూరు వస్తున్న సమయంలో రైల్లో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనొక మలయాళీ.. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడట. కొంత తెలుగు, కొంత ఇంగ్లీషు, అప్పుడప్పుడూ హిందీ.. ఎక్కువ శాతం అతను తెలుగు, ఇంగ్లీషు భాషల్లోనే మాట్లాడుతున్నాడు. అతని పేరు శ్రీనివాస నాయర్.. సీట్  ఎక్స్చేంజ్ అంశమై నేను మాట్లాడాను. అతను తన అప్పర్ బెర్త్ నాకు ఇచ్చి అతను లోయర్ బెర్త్ లోకి మారాడు. నాకు అప్పర్ బెర్త్ ఎందుకంటే పైన వుంటే జనం కదిలించరని ఒక ఆలోచన. కాసేపు నేను నా ఫేస్ బుక్ లో ఫోటోలు, స్టేటస్ పోస్ట్ చేస్తూ కూర్చున్నాను. అతను నా సెల్ ఫోనులో ఫోటోలు గమనిస్తున్నట్లున్నాడు.

‘‘మీరు యాక్టరా’’ అని అడిగారు.
నేను ‘‘అవును. ఏం?’’ అన్నాను.
దానకతను నవ్వుతూ.. ‘‘ఏంలేదు.. మీ ఎఫ్.బి.లో ఫోటోలు చూసి అడిగాను.’’ అంటూ నాతో మాటలు కలిపాడు.
మాటల సందర్భంలో నేను రైటర్ అని.. అప్పుడప్పుడు సరదాగా యాక్టింగ్ చేస్తానని చెప్పాను.
నేను రచయితను అనగానే అతను ‘‘అవునా.. మీరు ఏం రాశారు? ’’ అని అడిగాడు..
నేను రాసిన నాటికలు వరసపెట్టి చెప్పాను. వాటి వీడియో లింకులు అతనికి వాట్సప్ ద్వారా షేర్ చేశాను.
‘‘గమనం’’ నాటిక చూసి అతను చాలా ఎక్కువగా స్పందించాడు.
తనకు తెలిసిన ఒక కథ వుందని.. తమ పాల్ఘాట్ జిల్లాలో చోటు చేసుకుందని దానిని డ్రామాగా రాస్తారా అన్నాడు.
ముందు కథ చెప్పమన్నాను.
అతను కథ చెప్పటం మొదలు పెట్టాడు.
‘‘వాళ్ళుంటున్న వీధిలో ఒక స్కూల్ మాస్టరుండేవారని, వాళ్ళింట్లో గాయత్రి అనే ఒకామె ఎప్పటి నుంచో పనిమనిషిగా వుండేదని చెప్పాడు. గాయత్రి ఆ మాష్టారింటికి వచ్చినప్పుడు బొట్టు చెరిగిపోయిన గర్భవతి అని, ఆమె భర్త ఏదో దేవస్థానంలో మావటిగా వుండేవాడని, ఏనుగుకి శిక్షణ ఇస్తున్న సమయంలో దేవస్థానం ఏనుగు అతన్ని తొక్కి చంపేసిందని.. బిడ్డ కడుపులో వుండగానే భర్తను పోగొట్టుకున్న గాయత్రిని అటు అత్తింటి వారు కానీ, ఇటు పుట్టింటి వారు కానీ రానీలేదని, దాంతో భర్త జ్ఞాపకంగా కడుపులో వున్న బిడ్డకి జన్మనిచ్చి, పోషించుకోటం కోసం ఆమె ఎంతో మంది సాయం కోరిందని.. ఎవ్వరూ సాయం చెయ్యకపోవటంతో మాష్టారింటికి వచ్చిందని, అక్కడే బిడ్డను ప్రసవించిందని, అప్పటి నుంచి వాళ్ళింట్లోనే పని చేసుకుంటూ జీవనం కొనసాగించిందని చెప్పాడు. మాష్టారి భార్య చనిపోయాక ఉన్నట్లుండి గాయత్రి మీదకి మనసు మళ్ళింది ఆ రిటైరైన మాష్టారికి. ఆమె కొడుక్కి దాదాపు 30 సంవత్సరాలు వచ్చాయి. మాష్టారు తరచు గాయత్రిని అతని చేష్టలద్వారా, మాటల ద్వారా లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. గాయత్రి ఎంతకీ లొంగలేదు.. దాంతో ఆమె కొడుకుని ఎరగా వాడుకున్నాడు. అతను ఎక్కడ ఇంటర్వ్యూలకి వెళ్ళినా సెలక్ట్ అవ్వనిచ్చే వాడు కాదు. చివరికి విసిగిపోయిన ఆమె కొడుకుతో నీకు నేను ఉద్యోగమిప్పిస్తాను.. నీ తల్లిని నాతో ఒక్కరాత్రి గడపమన్నాడు ఆ మాష్టారు. ముందు నివ్వెర పోయాడు ఆమె కొడుకు.. తర్వాత తనున్న పరిస్థితి గమనించాడు.. మాష్టారు చేసిన ఆఫర్ ముందు తన తల్లిని ఒక్కరాత్రికి పంపటం పెద్ద తప్పేమీ అనిపించలేదు ఆ కొడుక్కి.. చివరికి మాష్టారికోరికను గాయత్రికి చెప్పాడు. ముందు కొడుక్కి చేస్తానన్నవన్నీ చేస్తే అప్పుడు మాష్టారి కోరిక తీరుస్తానని చెప్పింది. ఆ మాష్టారు కూడా ఆమె కొడుక్కి మంచి ఉద్యోగం వేయించాడు. ఆమె కొడుకు అమెరికా వెళ్ళిపోయి ఉద్యోగంలో చేరాడు. నెలజీతం అందుకున్నాడు. ఆరోజే మాష్టారు గాయత్రిని పొందే రోజుగా ఆమె నిర్ణయించింది. మాష్టారు సిద్ధపడ్డాడు... గాయత్రి మాష్టారిని తన గదికి రమ్మన్నది.. ఆ గదిలోకి అడుగు పెట్టిన మాష్టారు జరిగిన దృశ్యం చూసి పక్షవాతానికి గురయ్యాడు.’’ అని కథ ఆపేశాడు. అక్కడేం జరిగి వుంటుంది... అని అడిగాడు...
ఆమె చనిపోయిందా అని అడిగాను..
అవును.. మీకెలా తెలుసు అన్నాడు?
రచయితను కదా.. రచయిత ఎప్పుడూ ఊహిస్తాడు.. నేనూ అదే ఊహించాను. అన్నాను.
అయితే మీరు గాయత్రి కథను డ్రామాగా రాస్తారా అన్నాడు..
కథ బానే వుంది.. అయితే కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ నాటికగా మలుస్తాను. అన్నాను.

(సశేషం)

కామెంట్‌లు లేవు:

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు